భారంగా వీడ్కోలు!

ABN , First Publish Date - 2021-07-30T09:27:29+05:30 IST

కెరీర్‌లో చివరి ఒలింపిక్స్‌ ఆడుతున్న భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ (51కేజీ) ప్రీక్వార్టర్స్‌ బౌట్‌ వివాదాస్పదమైంది. గురువారం జరిగిన ఈ పోరులో ఆమె ఇన్‌గ్రిట్‌ వలెన్సియా (కొలంబియా) చేతిలో 2-3 తేడాతో పరాజయం పాలైంది...

భారంగా వీడ్కోలు!

  • ప్రీక్వార్టర్స్‌లో ఓడిన మేరీ కోమ్‌
  • జడ్జిల నిర్ణయం సరికాదన్న బాక్సర్‌


కెరీర్‌లో చివరి ఒలింపిక్స్‌ ఆడుతున్న భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ (51కేజీ) ప్రీక్వార్టర్స్‌ బౌట్‌ వివాదాస్పదమైంది. గురువారం జరిగిన ఈ పోరులో ఆమె ఇన్‌గ్రిట్‌ వలెన్సియా (కొలంబియా) చేతిలో 2-3 తేడాతో పరాజయం పాలైంది. అయితే అత్యంత ఆసక్తిగా జరిగిన ఈ బౌట్‌లోని మూడు రౌండ్లలో రెండింట మేరీ గెలిచినా చివరకు స్ల్పిట్‌ ఫలితంతో ఓడడం చర్చనీయాంశమైంది. 38 ఏళ్ల మేరీ కోమ్‌పై పతక ఆశలు ఉండడంతో ఈ బౌట్‌పై అందరూ ఆసక్తిని చూపారు. హోరాహోరీగా సాగిన బౌట్‌లో ఇద్దరూ పంచ్‌లతో విరుచుకుపడిన తీరు అబ్బురపరిచింది. అయితే తొలి రౌండ్‌లో ప్రత్యర్థికి నలుగురు జడ్జిలు 10 పాయింట్లు ఇవ్వడంతో మేరీ 1-4తో వెనుకబడింది. చివరి రెండు రౌండ్లలో మాత్రం తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ వలెన్సియాపై మేరీ పిడిగుద్దులను కురిపించింది. దీంతో ఈ రౌండ్లలో ఐదుగురు జడ్జిలలో ముగ్గురు మేరీకి పదేసి పాయింట్లు ఇచ్చారు. అటు వలెన్సియాకు ఇద్దరు జడ్జిలు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కానీ విజేతను నిర్ణయించే ఓవరాల్‌ స్కోరు విషయంలో మేరీ కోమ్‌కు ఇద్దరు మాత్రమే అనుకూలంగా ఉండడంతో నిరాశే ఎదురైంది. చివరి రౌండ్‌ను 3-2తో కాకుండా 4-1తో గెలిస్తే కోమ్‌ క్వార్టర్స్‌కు చేరుకునేది. ఇక బౌట్‌ ముగిశాక విజేత చేతిని పైకెత్తినప్పుడు మేరీ కోమ్‌ చిరునవ్వుతో కనిపించినా ఆ తర్వాత తన దుఖాన్ని దాచుకోలేకపోయింది. అటు మేరీ పోరాటాన్ని గమనించిన వలెన్సియా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆమె చేతిని కూడా పైకిలేపడం ఆకట్టుకుంది. అంతకుముందు వలెన్సియాతో తలపడిన రెండు సార్లూ మేరీ కోమ్‌ నెగ్గింది. అయితే జడ్జిలు పారదర్శకంగా వ్యవహరించలేదని మేరీ ఆరోపించింది. మ్యాచ్‌ ముగిశాక కూడా చాలాసేపు తానే గెలిచాననే భావనలో ఉన్నట్టు మేరీ తెలిపింది. రెండు రౌండ్లలో నెగ్గినప్పటికీ విజేతగా ఎందుకు ప్రకటించలేదంటూ ప్రశ్నించింది.


Updated Date - 2021-07-30T09:27:29+05:30 IST