Dust-storm: కువైత్‌లో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని దారుణ పరిస్థితులు.. ఎక్కడ చూసిన భీకర దృశ్యాలే!

ABN , First Publish Date - 2022-05-24T13:57:10+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ను గత కొన్నిరోజులుగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్ వణికిస్తోంది.

Dust-storm: కువైత్‌లో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని దారుణ పరిస్థితులు.. ఎక్కడ చూసిన భీకర దృశ్యాలే!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ను గత కొన్నిరోజులుగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్ వణికిస్తోంది. క్రమం తప్పకుండా ఒక్కసారిగా దుమ్ము ధూళి పొటెత్తుతున్నాయి. దీంతో దేశమంత దుమ్ము ధూళి దుప్పట్లో కూరుకుపోయింది. దుమ్ము ధూళితో కూడిన తుపాన్ల విషయానికి వస్తే గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరిస్థితులు ఉన్నాయని కువైత్ అధికారులు పేర్కొన్నారు. సోమవారం కూడా కువైత్‌లో భారీ ఈదురుగాలులు వీచాయి. దాంతో నగరాల్లోని వీధులన్ని ఎక్కడ చూసిన దుమ్ము దూళితో నిండిపోయాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను సైతం క్యాన్సిల్ చేసినట్లు కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే కొన్ని కమర్షియల్ ఫ్లైట్లను రిషెడ్యూల్ చేసినట్లు ఆ దేశ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. 


దుమ్ము-తుఫాను తగ్గిన తర్వాత విమానాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమవుతాయని కువైట్ సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫర్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ అఫైర్స్ ఎమాద్ అల్ జులువి తెలిపారు. ఇక సోమవారం కువైత్‌లో భారీ ధూళి కమ్ముకోవడంతో దేశవ్యాప్తంగా దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుమ్ము-తుఫాను కారణంగా ఏర్పడిన అస్థిర వాతావరణ పరిస్థితుల గురించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం దేశ పౌరులు, ప్రవాసులందరినీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. 



Updated Date - 2022-05-24T13:57:10+05:30 IST