మాస్టర్ లిస్ట్ తయారు చేశాం: కృష్ణ బాబు
ABN , First Publish Date - 2022-02-26T22:51:35+05:30 IST
రష్యాతో భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్లో ఉన్న ఏపీ ప్రజలను వెనక్కి తీసుకుని
అమరావతి: రష్యాతో భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్లో ఉన్న ఏపీ ప్రజలను వెనక్కి తీసుకుని రావటానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ, ఉక్రెయిన్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులు 85000 27678, 0863-2340678 నెంబర్లలో కాంటాక్ట్ చేయాలన్నారు. విదేశాంగ శాఖ మంత్రితో సీఎం మాట్లాడారని ఆయన తెలిపారు. మాస్టర్ లిస్ట్ ఒకటి తయారు చేశామన్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక ప్లైట్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముంబైకి చేరనుందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందన్నారు. ముంబాయి, ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చెయ్యాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో ఏపీ ప్లకార్డుతో సిబ్బంది ఉంటారన్నారు. ఏపీకి సంబంధించిన విద్యార్థులు వీరిని సంప్రదించవచ్చన్నారు. సరిహద్దుల్లోకి వెళ్ళవద్దని భారత రాయబార కార్యాలయం సూచన చేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఆ సూచనను తప్పక పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో ఉన్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామన్నారు. విద్యార్థులకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చిందన్నారు. అందులో ఏపీకి చెందిన వారు ముగ్గురే ఉన్నారని కృష్ణబాబు తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచిస్తున్నామన్నారు. ఉక్రెయిన్లో 7 వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని కృష్ణబాబు తెలిపారు.