వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-05-11T05:00:51+05:30 IST
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
కలెక్టర్ వీపీ గౌతమ్
మహబూబాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వైరస్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరికి రెండో డోసు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వ్యాక్సినేషన్ రెండో డోసులో తక్కువ ప్రగతిలో ఉన్న గంగారం, బయ్యారం, గార్ల మండలాల వైద్యులు, ఎంపీ డీవోలు, మండల ప్రత్యేకాధికారులతో సోమ వారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రోజు 100 మందికి రెండో డోసు టీకా తప్పనిసరిగా ఇవ్వలన్నారు. అందుకు మండల, గ్రామస్థాయి సిబ్బందిలో మెదటి డోసు వేసుకుని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి రెండో డోసు వేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వేయ డంలో రద్ధీ కాకుండా టెంట్లు వేసి కుర్చీలు ఏర్పాటు చేయా లన్నారు. భౌతికదూరం పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. రెండో డోసు పొందేందుకు ఆయా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి వేసుకోవాలని ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. టెలికాన్ఫరెన్స్లో జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్, కొవిడ్ జిల్లా అధికారి మల్లం రాజేష్, జడ్పీ సీఈవో అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
సమాచారం కోసమే కంట్రోల్ రూం..
కొవిడ్ సమాచారం ప్రజలకు తెలియజేసేందుకే కంట్రోల్రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ వీపీగౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్రూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని కంట్రోల్రూంను అనుసంధానం చేసుకుని నిత్యం సమాచారం తెప్పించుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో ఉన్న బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, కొవిడ్ పెషెంట్ల సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. అలాగే వరంగల్ ఎంజీఎం, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న బెడ్స్ వివరాలు తెలుసుకోవాలని, దీంతో పాటుగా మానుకోట జిల్లాలోని కొవిడ్ పెషెంట్లు ఆయా జిల్లాలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, సెల్నంబర్లు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటరమణ, అశోక్, రంజిత్ పాల్గొన్నారు.