భూములను లాక్కుంటే ఆత్మహత్యలే..
ABN , First Publish Date - 2021-06-16T05:20:30+05:30 IST
భూములను లాక్కుంటే ఆత్మహత్యలే..
జేసీబీని అడ్డుకున్న గిరిజన రైతులు
మహబూబాబాద్ టౌన్, జూన్ 15 : జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలో మెడికల్ కళాశాల కోసం గుర్తించిన స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, జేసీబీని గిరిజన రైతులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కాగా, ఇటీవలనే రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని మెడికల్ కళాశాల నిర్మాణం కు గుర్తించి పరిశీలించారు. సదరు భూమిని చదును చేసేం దుకు మంగళవారం గిర్థావర్ నరేష్, వీఆర్వో విజయ్కుమార్ జేసీబీ తీసుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న సాం క్రియతండా, బాబునాయక్తండాకు చెందిన గిరిజన రైతులు అక్కడికి చేరుకుని జేసీబీని అడ్డుకున్నారు. చదును చేసేం దుకు ప్రయత్నించినప్పటికి రైతులు అడ్డుకోవడంతో చేసేది ఏమిలేక అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతు లు భూక్య అశోక్నాయక్, నూనావత్ విజయ్ మాట్లాడుతూ.. తాము అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను మెడికల్ కళాశాల పేరిట లాక్కుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, భూక్య లక్ష్మి, బుజ్జి, గాయత్రి పాల్గొన్నారు.