ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు వద్దు
ABN , First Publish Date - 2021-11-30T05:34:10+05:30 IST
ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు వద్దు
ముళ్లకంచె వేసి ముడుపుగల్ రైతుల రాస్తారోకో
మహబూబాబాద్ రూరల్, నవంబరు 29 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్-తాళ్లపూసపల్లి రోడ్డుపై ముళ్లకంచె వేసి సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా రైతులు సురుగు రంగయ్య, లింగయ్య, జక్కుల వెంకన్న, వీరన్న, ఉపేందర్, గంగాధర్, యాకన్నలు మాట్లాడారు. వారం కిందట ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పారు. తాము పండించిన పంటను ఆ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి పంటకు ఆంక్షలు పెడుతూ అధికారులు ఇబ్బందులు పెడతున్నారని ఆరోపించారు. ధాన్యంలో తేమ 17 శాతం ఉండాలని, మట్టిపెల్లలు, రాళ్లు 1.1 శాతం, చెత్త, తాలు 1.0 శాతం, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5.0 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని అనేక కొర్రిలు పెట్టడం సరికాదన్నారు. ఆరుగాలం కష్టించి పంట సాగు చేసి మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తే నిరాశే ఎదురవుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి కొర్రిలు, ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంటపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహానాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై అరుణ్కుమార్ ఘటన స్థలికి చేరుకుని ఏడీఏ లక్ష్మినారాయణ, తహసీల్దార్ రంజిత్కుమార్, ఏవో తిరుపతిరెడ్డి, ఏపీఎం తిలక్, డీపీఎం నళినితో మాట్లాడారు. అనంతరం రైతులు రాస్తారోకో విరమించారు.