గంజాయి విక్రయిస్తే పీడీయాక్టు
ABN , First Publish Date - 2021-10-24T06:14:55+05:30 IST
గంజాయి విక్రయిస్తే పీడీయాక్టు
ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్ రూరల్, అక్టోబరు 23 : జిల్లాలోని ప్రజలు గంజాయి సాగు చేసినా... తరలించిన, విక్రయించిన అట్టివారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ నందన గార్డెన్లో శనివారం గంజాయి విక్రయించిన పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. యువత గంజాయి, డ్రగ్స్ భారీన పడుతున్న నేపథ్యంలో మత్తుపదార్థాల నియంత్రణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మానుకోటను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణా చేయాలంటే భయపడే పరిస్థితులు రావాలన్నారు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడకుండ చదువుపై దృష్టిసారించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయని, వీటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ కేసులు మరింత కఠినంగా ఉంటాయన్నారు. జైలుకు వెళితే బెయిల్ కూడా రాకుండ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్పీ యోగే్షగౌతమ్, డీఎస్పీలు సదయ్య, వై.రమేష్, రేలా జనార్దన్రెడ్డి, ఎక్సైజ్ సీఐ కృష్ణ, ఎస్బీఐ సీఐ సురేందర్, సీఐలు జూపల్లి వెంకటరత్నం, రవికుమార్, తిరుపతి, ఎస్సైలు అరుణ్కుమార్, వెంకన్న, రమాదేవి పాల్గొన్నారు.