సైన్యాన్ని కాషాయదళంగా మార్చేందుకే Agnipath
ABN , First Publish Date - 2022-06-29T14:50:03+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైనిక దళాలను కాషాయదళంగా మార్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎండీఎంకే నేత వైగో
- జిల్లా నేతల సభలో వైగో ధ్వజం
చెన్నై, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైనిక దళాలను కాషాయదళంగా మార్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎండీఎంకే నేత వైగో ధ్వజమెత్తారు. ఎగ్మూరులోని ఎండీఎంకే ప్రధాన కార్యాలయం ‘తాయగమ్’లో మంగళవారం జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘపరివార్ హిందూ రాష్ట్ర ఆశయం నెరవేర్చే దిశగానే కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని కాషాయదళంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. కావేరి నిర్వాహక మండలిలో మెకెదాటు ఆనకట్టపై చర్చించవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను డిమాండ్ చేస్తూ మరొక తీర్మానం ప్రతిపాదించారు. కూడంకుళమ్ అణువిద్యుత్ కేంద్రం వద్ద అణువ్యర్థాలను నిల్వ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయకూడదంటూ మరో తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు. పత్తినూలు ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కూడా ఓ తీర్మానాన్ని ఆమోదించారు.