వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం అర్థరహితం : భారత్

ABN , First Publish Date - 2021-10-13T23:23:31+05:30 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై

వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం అర్థరహితం : భారత్

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చైనాపై భారత్ విరుచుకుపడింది. ఈ అభ్యంతరాలు భారతీయుల అవగాహనకు, హేతుబద్ధతకు నిలవబోవని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని స్పష్టం చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించినట్లుగానే ఈ రాష్ట్రాన్ని కూడా భారత దేశ నేతలు తరచూ సందర్శిస్తూ ఉంటారని పేర్కొంది. 


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్టోబరు 9న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. శాసన సభ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో చైనా స్పందిస్తూ, వెంకయ్య నాయుడు పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము అరుణాచల్ ప్రదేశ్‌ను ఎన్నడూ గుర్తించలేదని పేర్కొంది. 


అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెప్తోంది. దీనిని తాము గుర్తించబోమని చెప్తోంది. ఈ రాష్ట్రానికి భారత దేశ నేతలు వెళ్లిన ప్రతిసారీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటుంది. వాస్తవాధీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేరకు భారత్-చైనా సరిహద్దు ఉంది. దీనిపై ఇరు దేశాల మధ్య వివాదం ఉంది. 


Updated Date - 2021-10-13T23:23:31+05:30 IST