జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు

ABN , First Publish Date - 2021-09-19T04:31:40+05:30 IST

జిల్లాలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు.

జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి
ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 18: జిల్లాలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.  మేదరులు తయారు చేసే వస్తువులకు మరింత విలువ తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మండలంలోని సాలెగూడ వద్ద ప్రత్యేక మెలకువలు నేర్పించడానికి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువ కావడంతో వెదురు ప్రాముఖ్యత తగ్గిందన్నారు. అయితే జిల్లాలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధించనున్నామని చెప్పారు.  వెదురు వస్తువులకు ఎంతో విలువ ఉంటుందని, మేదరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దానిలో మెలకువలు నేర్చుకోవాలన్నారు. వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే వస్తువుల తయారీలో మెలకువలు నేర్పడానికి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి నిపుణులను తీసుకు వచ్చి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం అవసరమైన వస్తువులు తయారు చేయడానికి ఐకేపీ శ్రీనిధి లేదా బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయనున్నట్ల వివరించారు. జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం మాదవాయిగూడ నుంచి ప్రారంభించామని చెప్పారు. రానున్నరోజుల్లో పూర్తి ప్లాస్టిక్‌ నిషేధం జిల్లాలో జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెదురును నాన్‌ టింబర్‌ జాబితాలోకి తీసుకు వచ్చిందని అన్నారు. ఇళ్లలో, పంట చేలలో, పొలాల్లో కూడా వెదురు పండించేందుకు అవకాశం ఉందన్నారు. దీని రవాణాకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో కూడా వెదురు పెంపకానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. అలాగే  గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులను బతికించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెదురు సాగు చేసే వారికి సబ్సిడీ ద్వారా రుణాలు అందించడానికి ప్రయత్నం చేయాలని అధికారులను కోరారు.  కార్యక్రమంలో జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, సంతోష్‌, ఎంపీడీవో దినేష్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ మల్లేష్‌, జిల్లా బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌, శ్రీకాంత్‌, కనకయ్య, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, సత్యనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:31:40+05:30 IST