Uttar Pradesh: గురుద్వారాలోకి మాంసం విసిరిన దుండగులు
ABN , First Publish Date - 2022-07-11T23:20:01+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని బరేలీ (Bareilly)లో కొందరు దుండగులు ఓ గురుద్వారా(Gurudwara)లోకి మాంసం (Meat) విసిరి
బరేలీ: ఉత్తరప్రదేశ్లోని బరేలీ (Bareilly)లో కొందరు దుండగులు ఓ గురుద్వారా(Gurudwara)లోకి మాంసం (Meat) విసిరి అపవిత్రం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బరేలీలోని కోదాపీర్లో ఈ ఘటన జరిగినట్టు ఎస్సెస్పీ సిద్ధార్థ్ అనిరుద్ పంకజ్ తెలిపారు. ముస్లింలు బక్రీద్ను జరుపుకుంటున్న వేళ వాతావరణాన్ని పాడుచేందుకు కొందరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
గురుద్వారా ప్రాంగణంలో మాంసం కనిపించగానే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మాంసం పడినట్టు కనిపించింది కానీ, దానిని ఎవరో విసురుతున్నట్టుగా మాత్రం లేదని పోలీసులు పేర్కొన్నారు. గురుద్వారా హెడ్ హర్వంత్ పాల్ సింగ్ బేడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ సిక్కు వ్యాపారులు సోమవారం నగరంలో తమ దుకాణాలను మూసివేశారు.