Medical సీటు పేరిట మోసం
ABN , First Publish Date - 2022-07-02T16:47:07+05:30 IST
మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కలబురగికి చెందిన ఓ డాక్టర్
- రూ.1.16 కోట్లు వసూలు చేసిన ముఠా
- ఐదుగురి అరెస్టు
బెంగళూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కలబురగికి చెందిన ఓ డాక్టర్ కుమారుడికి మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ రూ. 66 లక్షలు నగదు పొందాక హనీట్రాప్ ద్వారా బెదిరించి మరో రూ.50 లక్షలు వసూలు చేశారు. మెడికల్ సీటు కోసం తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డాక్టర్ వారిని కోరారు. బెంగళూరుకు వస్తే వాపసు చేస్తామని నమ్మించిన ముఠా మెజస్టిక్లోని ఓ లాడ్జిలో డాక్టర్ను బస చేయించారు. ఒకరోజు తర్వాత డబ్బు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈలోగానే డాక్టర్ గదికి ఇద్దరు మహిళలను పంపి ఆ వెంటనే నకిలీ పోలీసుల రూపంలో బ్లాక్మెయిల్ చేసి రూ.50 లక్షలు వసూలు చేశారు. ఈ మేరకు డాక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో సీసీబీ బృందం రంగంలోకి దిగింది. నాగరాజ్ సిద్ధణ్ణ బరోటి అలియాస్ నాగరాజ్ (36), మల్లికార్జున వాలి అలియాస్ ఓంప్రకాశ్ (38), మధుశేఖర్ అలియాస్ మధు (28), హమీద్ (31), బసవరాజ్ (35)ను అరెస్టు చేసిన పోలీసులు రూ.24లక్షల నగదుతోపాటు 25 గ్రాముల బంగా రం, నకిలీ వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుమారుడికి బెంగళూరులోని ప్రముఖమైన కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తామని రూ. 66 లక్షల నగదు పొందారు. ఇటు సీటు దక్కకపోవడం, మరోవైపు నగదు వాపసు చేయకపోవడంతో డాక్టర్ డిమాండ్ మేరకు బెంగళూరుకు రావాలని ముఠా కోరింది. ఈలోగానే హనీట్రాప్కు పాల్పడ్డారు. హనీట్రాప్ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత సొమ్ము లేకపోవడంతో డాక్టర్ తన ఆస్తి పత్రాలను ఇవ్వడంతో ఓ కో-ఆపరేటివ్ సొసైటీలో తాకట్టు పెట్టి రుణం పొంది సొమ్మును ముఠాకు ముట్టచెప్పారు. ఇలా ముఠాను నమ్మిన డాక్టర్ నగదుతోపాటు కుమారుడి చదువులోనూ అన్యాయానికి గురయ్యాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ముఠాగుట్టు రట్టయ్యింది.