వైద్య విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ABN , First Publish Date - 2022-08-19T06:55:03+05:30 IST
వైద్య విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యాం ప్రసాద్
పిన్నమనేనిలో హెల్త్ యూనివర్సిటీ అంతర కళాశాలల పోటీలు అట్టహాసంగా ప్రారంభం
గన్నవరం, ఆగస్టు 18: వైద్య విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.శ్ర్యాంప్రసాద్ అన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 22వ ఇంటర్ కళాశాలల మహిళల గేమ్స్ చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 27 మెడిసిన్, డెంటల్ కళాశాలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సి.నాగేశ్వర రావు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి, హెల్త్ యూనివర్సిటీ స్పో ర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి పాల్గొన్నారు.
తొలి రోజు ఫలితాలు..
తొలి రోజు బాల్ బ్యాడ్మింటన్లో డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ(చిన అవుటపల్లి)జట్టు, ఆంధ్ర వైద్య కళాశాల(విశాఖపట్నం) జట్టుపై 35-18 పాయింట్లతో గెలుపొందింది. టేబుల్ టెన్నిస్లో డాక్టర్స్ సుధా నాగేశ్వరరావు డెంటల్(చిన అవుటపల్లి), సిబర్ డెంటల్(గుంటూరు) జట్టుపై 3-1 పాయింట్ల తేడాతో గెలుపొందింది. జీఎస్ఎల్ డెంటల్(రాజమండ్రి) జట్టు, నెల్లూరు నారాయణ డెంటల్ జట్టుపై 3-0పాయింట్ల తేడాతో, త్రోబాల్లో రాజమండ్రి జీఎస్ఎల్ డెంటల్ కళాశాల జట్టు భీమవరం విష్ణు డెంటల్ జట్టుపై 15-0, 15-09 పాయింట్ల తేడాతో గెలుపొందింది. విజయవాడ ఎస్ఎంసీ కళాశాల జట్టు, నెల్లూరు నారాయణ వైద్య కళాశాల జట్టుపై 15-12, 15-06, 15-12 తేడాతో గెలుపొందింది. శ్రీకాకుళం జేమ్స్ కళాశాల జట్టు గుంటూరు సిబర్ దంత కళాశాల జట్టుపై 15-03, 15-06 పాయింట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నం అనిల్ నీరుకొండ దంత కళాశాల జట్టు తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఎంసీ జట్టుపై 15-05, 12-03 తేడాతో గెలుపొందినట్లు హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి తెలిపారు.