కొవిడ్ వైద్యసేవలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-04T04:54:47+05:30 IST
కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ కొవిడ్ వైద్యసేవలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ సూచించారు.
జిల్లాలో మంచి అధికారులు ఉన్నారు
జిల్లా ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు,
ట్రామాకేర్ ఏర్పాటుకు కార్యచరణ
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ
ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు 3: కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ కొవిడ్ వైద్యసేవలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ సూచించారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూలో మాట్లాడారు. ముందుగా కలెక్టర్ కర్ణన్ జిల్లాలో వైద్య సేవలను వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఆశ కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు సమిష్టిగా ప్రతి ఒక్కరూ కరోనాకు భయపడకుండా బాధ్యతగా విధులు నిర్వహించారని వివరించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ప్రోగ్రామ్ అఫీసర్లు డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ వరుకూటి సుబ్బారావు పవర్పాయింట్ ప్రజెంటటేషన్ ద్వారా సేవలను వివరించారు. ఈ సందర్భంగా కమిష నర్ కరుణ మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం అలవాటు చేయాలని సూచించారు. అలాగే క్షయ నియంత్రణ నూరుశాతం అదుపులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నమోదు నుంచి వారికి వైద్యసేవలు అందించే వరకు క్రమపద్దతిలో జిల్లా ఆదర్శంగా ఉందని కితాబునిచ్చారు.
డైనమిక్ అఫీసర్లు
కలెక్టర్ కర్ణన్ డైరెక్షన్లో జిల్లాలో డైనమిక్ వైద్య అఫీసర్లు ఉన్నారని జిల్లాలో వినూత్నంగా నిర్వహించిన వైద్య కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని కరుణ అభినందించారు. టీబీ క్లబ్లు, సామాజిక క్షయ నియంత్రణ భాగస్వామ్యం, టీబీ ఛాంపీయన్ వంటి కార్యక్రమాలలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని అభినందించారు. మిషన్ నారీ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో అమలు చేసేందుకు జిల్లా ఆదర్శంగా ఉందన్నారు. జిల్లా ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు, ట్రామాకేర్ ఏర్పాటుకు కార్యచరణ చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాధి నిర్దారణ పరీక్షా కేంద్రాన్ని ముందుగా ఖమ్మంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా, ఎన్సీడీ, క్షయ, డెంగ్యూ,మలేరియా నియంత్రణలో ఖమ్మం ఆదర్శంగా సంబందిత ప్రోగ్రమ్ అఫీసర్లు డాక్టర్ కొటిరత్నం, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రామారావు, డాక్టర్ సైదులును కమిషనర్ అభినందించారు.
కనీస వేతనం రూ.7వేలు ఇవ్వాలి:
ఆశ కార్యకర్తలు వినతి
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ.7వేలకు తగ్గకుండా ఇవ్వాలని సీఐటీ యూ మెడికల్ విభాగం, టీఆర్ఎస్కేవీ ఆశా సంఘాల అధ్వర్యంలో కమిషనర్ వాకాటి కరుణకు వినతిపత్రాలు అందించారు. స్పందించిన కమిషనర్ న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. చిన్నారులకు వ్యాధి నిరోదక టీకాల నుంచి మాతాశిశు వైద్యసేవల్లో కీలకంగా ఉండే ఏఎన్ఎంలతో కరోనా పరీక్షలు నిర్వహించవద్దని వైద్యఆరోగ్యశాఖ సంఘాల అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.