నేడు విద్యాదీవెన ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-19T05:25:27+05:30 IST
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ప్రారంభిస్తారని కలెక్టర్ జి.వీర పాండియన్ తెలిపారు.
- పండుగ వాతావరణంలో నిర్వహించండి
- జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 18: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ప్రారంభిస్తారని కలెక్టర్ జి.వీర పాండియన్ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో చేయాల్సిన ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్కు జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీడీ సోషల్ వెల్ఫేర్ రమాదేవి, ఆర్డీవోలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్పెషల్ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వీర పాండియన్ మాట్లాడుతూ కొవిడ్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించి జగనన్న విద్యాదీవెన లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ఇంటరాక్షన్ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేల సమన్వయంతో ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆదివారం సాయంత్రంలోపు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లైవ్ టెస్టింగ్ను, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎల్ఈడీ స్కీన్స్ కనెక్టివిటీ, లబ్ధిదారుల ఇంటరాక్షన్ తదితర అన్ని టెస్టింగ్ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 14 నియోజకవర్గాలలో జగనన్న విద్యాదీవెన పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహిస్తూ, కొవిడ్ నియమ నిబంధ నలు పాటిస్తూ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2020-2021 సంవత్సరానికి సంబందించి రెన్యూవల్ స్టూడెంట్స్ 55,224 మంది విద్యార్థులు, 2020-2021 సంవ త్సరానికి సంబంధించి ఫ్రెషర్ స్టూడెంట్స్ 30,539 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద ఆర్థిక లబ్ది పొందనున్నారని తెలిపారు.
నియోజకవర్గాల వారిగా..
జగనన్న విద్యాదీవెన పథకాన్ని నియోజకవర్గా వారిగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు.
కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలు
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ అకడమిక్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ సెమినార్ హాల్, నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజీ, నంద్యాల, ఆళ్లగడ్డ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆదోని ఆర్ట్స్ అడ్ సైన్స్ కాలేజ్, డోన్ వైష్ణవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ, మంత్రాలయం శ్రీరాఘవేంద్ర డిగ్రీ కాలేజీ, ఎమ్మిగనూరు ఎస్టీ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పాణ్యం కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దూపాడు, ఆలూరు శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్, శ్రీశైలం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆత్మకూరు, నందికొట్కూరు శ్రీ సాయిరాం డిగ్రీ కాలేజ్, బనగానపల్లె ఎస్వీ డిగ్రీ కాలేజ్, కోడుమూరు ఎంపీడీవో ఆఫీస్.