Minister Perni Naniతో సినీ పెద్దల కీలక భేటీ.. ఏం సమాచారం ఇచ్చారో..!?
ABN , First Publish Date - 2021-10-29T18:30:10+05:30 IST
మంత్రి పేర్ని నానితో సచివాలయంలో సినీ పెద్దలు భేటి ముగిసింది. సమావేశానికి దిల్ రాజు, అలంకార ప్రసాద్, బన్నివాసు, ప్రసాద్, వంశీ హాజరయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో సినీ ప్రముఖుల వరుస భేటీలు అటు రాజకీయాల్లో.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. గురువారం రోజున ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై ఆర్డినెన్స్ జారీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే.. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున భేటీ కావడం.. ఇందుకు సంబంధించిన వివరాలేమీ బయటికి చెప్పకుండా జగన్కు శ్రేయోభిలాషిని అని మాత్రమే చెప్పి హైదరాబాద్కు వెళ్లిపోయారు.
నిన్న అలా.. ఇవాళ ఇలా..!
అయితే.. ఇవాళ మంత్రి పేర్ని నానితో మరోసారి సినీ పెద్దలు భేటీ అయ్యారు. సచివాలయంలో సుమారు అరగంటకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. భేటి ముగిసిన అనంతరం మీడియాతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం వైపు నుంచి కొంత సమాచారం అడిగారని.. అది ఇచ్చేందుకే ఇవాళ ఇక్కడికి వచ్చామన్నారు. అయితే.. ఏమి సమాచారం అడిగారు.. దేని గురించి అడిగారు..? అని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. మంత్రిగారు అధికారికంగా తెలియజేస్తారని దిల్ రాజు చెప్పారు. కాగా.. సినిమా టికెట్లు, కరోనా టైంలో సినిమా హాళ్లకు విద్యుత్ చార్జీల బకాయిలపై పెనాల్టీల విషయాలపై ముఖ్యంగా చర్చించారని తెలుస్తోంది. ఇవాళ జరిగిన భేటీలో అలంకార ప్రసాద్, బన్నివాసు, ప్రసాద్, వంశీతో మరికొందరు పాల్గొన్నారు.
ఏం చెబుతారో..!
కాగా.. నిన్న నాగార్జున భేటీ అయిన తర్వాత ఇవాళ ఇలా నిర్మాతలు సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు భేటీకి సంబంధించిన విషయాలేమీ బయటికి చెప్పకపోవడం గమనార్హం. మరి మంత్రి నాని అధికారికంగా ఏమేం ప్రకటిస్తారో వేచి చూడాలి.