మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

ABN , First Publish Date - 2021-10-31T13:49:51+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఏడోవిడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఆరుమార్లు నిర్వహించిన మెగా శిబారాలకు అనూహ్య స్పందన రావడంతో పాటు ఆశాజనకమైన

మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు విశేష స్పందన

                         - కంజనాయకన్‌పట్టిలో శిబిరాన్ని పరిశీలించిన సీఎం స్టాలిన్‌


పెరంబూర్‌(Chennai): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఏడోవిడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఆరుమార్లు నిర్వహించిన మెగా శిబారాలకు అనూహ్య స్పందన రావడంతో పాటు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిని కొనసాగించాలని నిర్ణయిచింది. ఇందులో భాగంగా శనివారం ఏడవ విడత శిబిరాన్ని నిర్వహించింది. టీకా ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్రప్రభుత్వం గతంలో ఐదుసార్లు ఆదివారాలు, ఒకసారి శనివారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజలకు మొదటి, రెండవ డోస్‌ వాక్సిన్‌ వేశారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ గురించి ప్రజలకు తెలియజేసేలా పలురకాలుగా అవగాహన ప్రచారాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, శనివారం నిర్వహించిన ఏడవ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో 1,600 శిబిరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థలతో కలసి వైద్య సిబ్బంది టీకాలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక చింతాద్రిపేట చేపల మార్కెట్‌లో టీకా వేసుకున్న వారికి స్వీట్లు పంపిణీ చేయడం విశేషం. విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట యూనియన్‌ కంజనాయకన్‌పట్టి పంచాయతీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, తంగం తెన్నరసు, జిల్లా కలెక్టర్‌ జె.మేఘనాథరెడ్డి తదితరులున్నారు. 


నవంబరులో 1.40 కోట్ల టీకాలు

నవంబరు నెలకు సంబంధించి 1.40 కోట్ల కరోనా టీకా డోసులు అందించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక అడయార్‌ కస్తూరిబాయ్‌ నగర్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటైన టీకా శిబిరాన్ని మంత్రి సుబ్రమణ్యం, జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ బేదీ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత మే, జూన్‌, జూలై నెలల్లో కరోనా టీకాలకు కొరత ఏర్పడిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి, రాష్ట్రంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమాలను పరిశీలించిన కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన టీకాలు అందజేస్తోందని తెలిపారు. గత సెప్టెంబరులో 1.04 కోట్ల టీకాలు అందించిన నేపథ్యంలో, రాష్ట్రంలో టీకాల ప్రక్రియ వేగవంతం కావడంతో అదనంగా 43 లక్షల డోసులు అందజేసిందన్నారు. ఈనెలలో 1.22 కోట్లు అందజేయనున్నారని, వాటిని సక్రమంగా వినియోగిస్తే మరో 3 లక్షల డోసులు అదనంగా ఇస్తామని తెలిపిన కేంద్రం, నవంబరు నెలలో 1.40 కోట్ల డోసులు అందిస్తామని హామీ ఇచ్చిందని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-10-31T13:49:51+05:30 IST