‘మెకెదాటు’ ప్రస్తావన వద్దు

ABN , First Publish Date - 2022-07-21T13:13:49+05:30 IST

కావేరీ నదిపై మెకెదాటులో కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డ్యాం వ్యవహారాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర

‘మెకెదాటు’ ప్రస్తావన వద్దు

- కావేరి నిర్వహణా మండలిలో చర్చించొద్దు  

- సుప్రీంకోర్టు స్పష్టీకరణ


చెన్నై, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కావేరీ నదిపై మెకెదాటులో కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డ్యాం వ్యవహారాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. త్వరలో ఢిల్లీలో జరుగనున్న కావేరీ నిర్వహణా మండలి సమావేశంలో మెకెదాటు  వ్యవహారం ప్రస్తావించొద్దని తేల్చి చెప్పింది. కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని రాంనగర్‌ జిల్లా మెకెదాటు ప్రాంతంలో డ్యాం నిర్మించతలపెట్టింది. దానికి సంబంధించి తుది నివేదికను కేంద్రప్రభుత్వం నుంచి పొందేందుకు కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిని అడ్డుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కాగా మెకెదాటు డ్యాం నిర్మాణ అనుమతులు పొందే చర్యల్లో భాగంగా కావేరీ నిర్వహణా మండలిలోనూ ఈ అంశంపై చర్చించాలని కర్ణాటక ప్రభుత్వం యోచించింది. అందుకు కావేరీ మండలి కూడా అనుమతించింది. అంతేగాక  జూన్‌ 15న ఢిల్లీలో జరగాల్సిన సమావేశంలో చర్చించేందుకు కూడా మండలి నిర్వాహకులు సిద్ధమయ్యారు. అయితే మండలి సమావేశంలో మెకెదాటుపై చర్చించరాదని, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా జూన్‌ 15న జరగాల్సిన కావేరీ నిర్వహణా మండలి సమావేశం వివిధ కారణాలతో నిలిచిపోగా, ఈ నెల 22న నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కావేరీ నదీ జలాల పంపిణీలో కూడా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది తెలిపారు. మెకెదాటులో డ్యాం నిర్మాణం చేపట్టినా, తగిన జలాలు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం చెబుతున్న మాటల్ని విశ్వసించలేమన్నారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కావేరీ నిర్వహణా మండలిలో మెకెదాటు అంశంపై చర్చించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఇరుతరఫు వాదనల అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలో జరుగనున్న కావేరీ నిర్వహణా మండలి సమావేశంలో మెకెదాటుపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 2018 నుంచి తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ఈ కేసు పెండింగ్‌లోనే వుండగా, ఇప్పుడు కావేరీ నిర్వహణామండలిలో చర్చించాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2022-07-21T13:13:49+05:30 IST