మేకెదాటుపై సుప్రీంలో Tamilnaduకు షాక్‌

ABN , First Publish Date - 2022-07-21T17:44:26+05:30 IST

కావేరి నదికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేకెదాటు ప్రాజెక్టు విషయంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది.

మేకెదాటుపై సుప్రీంలో Tamilnaduకు షాక్‌

- అత్యవసరంగా పరిగణించలేమన్న ధర్మాసనం  

- 26కు వాయిదా 


బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కావేరి నదికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేకెదాటు ప్రాజెక్టు విషయంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. కావేరి నీటి నిర్వహణా మండలి నిర్ణయాలను పరిగణించరాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సదరు పిటీషన్‌ను అత్యవసరంగా విచారణ జరిపించాలన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బుధవారం విచారణకు స్వీకరించిన పిటీషన్‌ను అత్యవసరంగా విచారణకు నిరాకరించిన ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాలకై డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. దీనిపై అనుమతులు ఇవ్వరాదని తమిళనాడు ప్రభుత్వం వారం క్రితం సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. మేకెదాటు ప్రాజెక్టుపై చర్చలు జరిపేందుకు కావేరి నీటి నిర్వహణామండలి శుక్రవారం సమావేశం కానుంది. సీఎం బసవరాజ్‌ బొమ్మై మండ్యలో మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు ప్రాజెక్టు తుదితీర్పు వారం రోజుల్లో వెలువడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నుంచి పంపిన డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందన్నారు. ఆ వెంటనే మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాలకు శ్రీకారం చుడతామన్నారు. మేకెదాటు ద్వారా మండ్య, బెంగళూరు నగరాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. కేఆర్‌ఎస్‌ ద్వారా మైసూరు, మండ్య, హాసన్‌ జిల్లాల పరిధిలో 15 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణం చేస్తామన్నారు. 

Updated Date - 2022-07-21T17:44:26+05:30 IST