CM YS Jagan కే ఆ ఘనత ఇద్దామని.. !
ABN , First Publish Date - 2022-02-22T14:22:42+05:30 IST
సీఎం చర్చలతోనే ఆ ఒప్పందం కుదిరిందని..
హైదరాబాద్ సిటీ/అమరావతి : కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దుబాయ్ ఎక్స్పోకు భారీ బృందంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు జరిగిన ఆ ఎక్స్పోలో అనేక మందితో పెట్టుబడుల కోసం సమావేశాలు జరిపారు. చిన్నా, పెద్దా కలిపి దాదాపు 400 భేటీల్లో పాల్గొన్నారు. ‘మనం ఎదగడానికి సాయపడిన వారికి తిరిగి సాయం చేయడం కంటే సంతృప్తి ఏముంటుంది.. రండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’ అని అక్కడి ప్రవాసులకు పిలుపిచ్చారు. ఈ పర్యటనలో తన సమక్షంలో రూ.5,150 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగేలా చేశారు. అయితే అక్కడ డీపీ వరల్డ్ అనే కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం ఆయన బయటకు వెల్లడించలేదు.
దుబాయ్ నుంచి రాష్ట్రానికి వచ్చాక.. సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి.. సదరు కంపెనీల ప్రతినిధులను ఆయనకు పరిచయం చేసి.. సీఎం చర్చలతోనే ఆ ఒప్పందం కుదిరిందని చెప్పాలనుకున్నారు. ఆ ఘనతను ముఖ్యమంత్రికే ఇవ్వాలని భావించారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఆయన.. మంగళవారం ఇందుకోసం సీఎం అపాయింట్మెంట్ (సమయం) కూడా తీసుకున్నారు. ఆయన్ను కలిసి దుబాయ్ పర్యటన విశేషాలు వివరించి.. ఈ పెట్టుబడి ఒప్పందం గురించి ప్రకటిద్దామని భావించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలన్నీ చెబుతానని తనకు పరిచయమున్న పాత్రికేయులకు చెప్పారు కూడా.. ఇంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది.