సోమశిలలో 70 టీఎంసీలు ఉండేలా చూడండి
ABN , First Publish Date - 2020-11-30T04:34:54+05:30 IST
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమశిల జలాశయంలో నీటి పరిమాణం 70 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
అనంతసాగరం, నవంబరు 29: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమశిల జలాశయంలో నీటి పరిమాణం 70 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన సోమశిల జలాశయాన్ని సందర్శించారు. వరద తాకిడితో దెబ్బతిన్న పొర్లు కట్టలు, కట్టడాలు, తాగునీటి పథకాలను పరిశీలించారు. క్రస్ట్గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి వివరాలపై ఆరా తీశారు. వర్షాలు కురుస్తున్న పరిస్థితులకు అనుగుణంగా జలాశయంలో నీటి నిల్వను 70 టీఎంసీలకు నిలువరించి పెన్నాతీర గ్రామాల్లో ప్రమాదాలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కిందకు నీటిని విడుదల చేయాలని సూచించారు. సోమశిల పరిధిలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో సోమశిలకు వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జలాశయం క్రస్ట్గేట్ల పటిష్టతపై ఎస్ఈ కృష్ణారావుతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకలు పాల్గొన్నారు.