అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-07-25T05:35:55+05:30 IST
గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీపీ, జడ్పీటీసీల మధ్య వాగ్వివాదం
రాయికల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
రాయికల్, జూలై 24: గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయికల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి అధ్యక్షతన శనివా రం జరిగింది. ముఖ్య అథితిగా జడ్పీటీసీ జాదవ్ అశ్విని హాజరయ్యారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించిందని అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతలు నిర్మించుకుని సంవత్సరాలు గడుస్తున్నా బి ల్లులు అందించడం లేదని సర్పంచ్లు రాజమౌళి, తిరుమల్లు అధికారు లను నిలదీశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఎంపీడీవో గంగుల సంతోష్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నెరాజరెడ్డి, పిఆర్ ఏఈ ప్రసాద్ వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.
ఎంపీపీ, జడ్పీటీసీల మధ్య వాగ్వివాదం
సమావేశంలో మండల పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలో గ్రామాల్లో పాడి రైతులకు బీమాపై అవగాహన కల్పించా లని జడ్పీటీసీ అశ్విని కోరారు. ఆ సమయంలో ఎంపీపీ సంధ్యారాణి స్పందించి తన అనుమతి లేకుండా ఎలా మాట్లాడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాను కూడా జడ్పీటీసీ సభ్యురాలిని అని ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకురాలిని అని విషయం వచ్చింది కాబట్టి మాట్లాడా నని అన్నారు. ఎంపీపీ వైఖరిని నిరసిస్తూ సభ నుంచివెళ్లిపోయారు. దీంతో ఎంపీడీవో సంతోష్కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు స్పందించి జడ్పీటీసీని తిరిగి సమావేశానికి తీసుకువచ్చారు.