బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్లో మేనక, వరుణ్లకు దక్కని చోటు
ABN , First Publish Date - 2021-10-07T20:18:28+05:30 IST
భారతీయ జనతా పార్టీ నూతన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ కమిటీలో మాజీ కేంద్ర మంత్రి మేనక గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలకు చోటు దక్కలేదు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణా బీజేపీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్ నియమితులయ్యారు.
నూతన జాతీయ కార్యవర్గ కమిటీలో 80 మంది రెగ్యులర్ సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు. అయితే ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్ ఎంపీ మేనక గాంధీ, ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీలకు స్థానం దక్కలేదు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ, కౌన్సిల్స్లో సభా పక్ష నాయకులు , మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా ప్రెసిడెంట్స్ తదితరులకు ఈ కమిటీలో అవకాశం కల్పించారు.
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి జి. కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కింది. తెలంగాణ నుండి డికె. అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చోటు లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి పురుందేశ్వరికి చోటు దక్కింది.
జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్కు స్థానం దక్కింది. తెలంగాణ నుండి విజయశాంతి, ఈటెల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్లకు కూడా ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు.