కొడుకు హైదరాబాద్‌లో.. కూతుళ్లు అమెరికాలో.. ఎడబాటు భరించలేక తల్లి ఆత్మాహుతి

ABN , First Publish Date - 2022-05-21T09:00:33+05:30 IST

కొడుకు హైదరాబాద్‌లో.. కూతుళ్లు అమెరికాలో.. ఎడబాటు భరించలేక తల్లి ఆత్మాహుతి

కొడుకు హైదరాబాద్‌లో.. కూతుళ్లు అమెరికాలో.. ఎడబాటు భరించలేక తల్లి ఆత్మాహుతి

7 లక్షల నగదు, బంగారం, ఆస్తిపత్రాలతో నిప్పంటించుకున్న వైనం


నరసరావుపేట లీగల్‌, మే 20: ఎంత ఆస్తిపాస్తులుంటేనేం.. ఎదిగొచ్చిన బిడ్డలు దూరంగా ఉండడాన్ని మాత్రం ఆ తల్లి భరించలేకపోయింది. ఆఖరికి తనతో పాటు ఉన్న మనవడిని కూడా కూతురు తీసుకెళ్లిపోవడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బంగారు నగలన్నింటినీ ధరించింది. ఆస్తి పత్రాలతో సహా.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హృదయవిదారకరమైన ఈ ఘటన పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట రామిరెడ్డిపేటలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ అశోక్‌ కుమార్‌ కథనం ప్రకారం.. దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన కోట్ల రామారావు, కుమారి(52) దంపతులు రెండున్నరేళ్ల నుంచి రామిరెడ్డిపేటకు వచ్చి పాత సమితి ఆఫీసు సమీపంలో ఉంటున్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనైన కుమారి..  భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని రూ.7 లక్షలు నగదు, ఆస్తుల డాక్యుమెంట్లు  కుప్పగా పోసి..  బంగారు ఆభరణాలను ధరించి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-21T09:00:33+05:30 IST