విమానాశ్రయం-కేళంబాక్కం మధ్య Metro రైలు మార్గం
ABN , First Publish Date - 2021-12-28T16:56:01+05:30 IST
దక్షిణ చెన్నై పరిధిలోని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి కేళంబాక్కంల మధ్య మెట్రోరైలు మార్గం నిర్మితం కానుంది. సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పథకాన్ని ప్రభుత్వం నుంచి అనుమతి పొందాక
చెన్నై/ప్యారీస్: దక్షిణ చెన్నై పరిధిలోని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి కేళంబాక్కంల మధ్య మెట్రోరైలు మార్గం నిర్మితం కానుంది. సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పథకాన్ని ప్రభుత్వం నుంచి అనుమతి పొందాక 15.3 కి.మీ మార్గంలో 13 రైల్వేస్టేషన్లతో మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నట్టు చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అధికారులు తెలిపారు. చెన్నైలో వాహనాల రద్దీ నియంత్రించే దిశగా మెట్రోరైల్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలివిడతగా సెయింట్ థామస్ మౌంట్-ఎంజీఆర్ సెంట్రల్, విమానాశ్రయం-వింకో నగర్ అనే రెండు మార్గాల్లో 52 కి.మీ దూరానికి మెట్రోరైళ్లు నడుపుతున్నారు. రెండవ విడత మెట్రోరైల్ పథకాన్ని రూ.61,843 కోట్లతో 118.9 కి.మీ దూరానికి మూడు మార్గాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో మాధవరం ఆవిన్ పాల ప్లాంట్-సీఎండీఏ, మాధవరం-తరమణి లింక్ రోడ్ల మధ్య 52.01 కి.మీ మార్గం పనులు 95 శాతం ముగిశాయి. మైలాపూర్ లైట్హౌస్-పూందమల్లి బైపాస్ రోడ్ల మధ్య 26.01 కి.మీ మార్గం పనులు 2026 నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, మెట్రోరైల్ విస్తరణ మార్గంలో భాగంగా విమానా శ్రయం నుంచి కేళంబాక్కం వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు.