మెట్ట పైర్లను చుట్టుముట్టిన తెగుళ్లు
ABN , First Publish Date - 2022-01-05T04:50:09+05:30 IST
పొదలకూరు వ్యవసాయ సబ్డివిజన్లోని మెట్ట పైర్లను తెగుళ్లు చుట్టుముట్టాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తెగుళ్ల బారినపడ్డాయి.
పొదలకూరు రూరల్, జనవరి 4: పొదలకూరు వ్యవసాయ సబ్డివిజన్లోని మెట్ట పైర్లను తెగుళ్లు చుట్టుముట్టాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తెగుళ్ల బారినపడ్డాయి. భూమిలో నెలకొన్న తేమ కారణంగా మినుము, పెసర పంటల్లో కలుపు బెడద ఎక్కువైనట్లు స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దానికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు గిరక, తుంగ, ఊదర బాగా విస్తరిస్తోందని వారు వెల్లడించారు. దీని నివారణకు ఫినెక్ఫోప్రాడ్ మిథైన్ 9శాతం ద్రావణం 250మి.లీ ఒక్క లీటరుకు పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం 10కిలోల యూరియా ఎకరాకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మినుము పంట పూత దశలో ఉందని, ఈ దశలో పొటాష్ ఎకరాకు 10 కిలోలు వేస్తే గింజలు గట్టి పడతాయని శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు వివరించారు. దానితో పాటుగా పంటల్లో జింక్, ఇనుపధాతు లోపాలు కనిపిస్తున్నట్లు వివరించారు. వీటి నివారణకు లీటరు నీటికి 9కిలోల జింక్ సల్ఫేట్తో పాటు, ఇనుప ధాతు లోపానికి ప్రెడ్రిక్ సల్ఫేట్ నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.