Russia-Ukraine war: మోదీతోనే రష్యా-ఉక్రెయిన్ మధ్య సయోధ్య : మెక్సికో

ABN , First Publish Date - 2022-09-23T19:38:37+05:30 IST

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతి కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని

Russia-Ukraine war: మోదీతోనే రష్యా-ఉక్రెయిన్ మధ్య సయోధ్య : మెక్సికో

న్యూయార్క్‌ :  రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతి కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఐక్య రాజ్య సమితికి మెక్సికో ప్రతిపాదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌లను ఈ కమిటీలో నియమించాలని పేర్కొంది. ఉక్రెయిన్‌పై జరిగిన ఐరాస భద్రతా మండలి చర్చలో ఈ ప్రతిపాదన చేసింది. 


మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ (Marcelo Luis Ebrard Casaubón) మాట్లాడుతూ, మానవ సంబంధాలను శాసించవలసినది శాంతియుత సంబంధాలేనని, హింసాత్మక సంబంధాలు కాదని, వివాదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్న సిద్ధాంతం ఆధారంగా మెక్సికో ఓ ప్రతిపాదన చేస్తోందన్నారు. శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తిసామర్థ్యాలన్నిటినీ వినియోగించాలన్నారు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ ఒబ్రాడార్ చేస్తున్న ప్రతిపాదనను తాను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మధ్యవర్తిత్వం కోసం చేస్తున్న కృషిని మరింత బలోపేతం చేయాలన్నారు. దీని కోసం  రష్యా, ఉక్రెయిన్ (Russia and Ukraine) మధ్య శాశ్వత శాంతిని సాధించడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌లను ఈ కమిటీలో నియమించాలన్నారు. 


చర్చలకు నూతన మార్గాలను ఏర్పరచడం, నమ్మకాన్ని పెంచడానికి మధ్యవర్తిత్వం వహించడం కోసం అనుబంధ అవకాశాలను సృష్టించడం, ఉద్రిక్తతలను తగ్గించడం, శాశ్వత శాంతి కోసం మార్గాలను తెరవడం లక్ష్యాలుగా ఈ కమిటీ పని చేయాలన్నారు. మధ్యవర్తిత్వం కోసం ఐరాస సెక్రటరీ జనరల్ నేతృత్వంలో జరుగుతున్న కృషికి మెక్సికో ప్రతినిధి బృందం  సహకారం కొనసాగుతుందని తెలిపారు. ఐరాస సభ్య దేశాల మద్దతుతో ఏర్పాటు కాబోయే కమిటీకి కూడా తాము సహకరిస్తామని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల షాంఘై సహకారం సంఘం (SCO) సమావేశం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని పుతిన్‌కు మోదీ ఈ సందర్భంగా చెప్పారు. మోదీ వ్యాఖ్యలను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు స్వాగతించాయి. 


Updated Date - 2022-09-23T19:38:37+05:30 IST