Dallas: మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా

ABN , First Publish Date - 2022-06-21T14:12:44+05:30 IST

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగాశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Dallas: మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా

డాలస్, టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగాశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కు మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే గాక, నిత్యం అభ్యాసం చేయ్యవలసిన కార్యక్రమమని పేర్కొన్నారు. యోగావల్ల శరీరం, మనస్సు మన అధీనంలో ఉంటాయని తెలియజేస్తూ, యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.


అసీం మహాజన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ప్రతిరోజూ యోగా చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలియజేశారు.











Updated Date - 2022-06-21T14:12:44+05:30 IST