Kanwar Yatraకు ఉగ్ర ముప్పు...అదనపు భద్రత కల్పించాలని Ministry of Home Affairs ఆదేశం

ABN , First Publish Date - 2022-07-15T15:09:13+05:30 IST

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం ప్రారంభమైన కన్వర్ యాత్ర(Kanwar Yatra)కు భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు....

Kanwar Yatraకు ఉగ్ర ముప్పు...అదనపు భద్రత కల్పించాలని Ministry of Home Affairs ఆదేశం

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం ప్రారంభమైన కన్వర్ యాత్ర(Kanwar Yatra)కు భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్వర్ యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికతో యాత్రలో పాల్గొనే కన్వారియాలకు భద్రతను పెంచాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా కన్వర్ యాత్రకు భద్రతా ఏర్పాట్లను పెంచాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ఒక సలహాను జారీ చేసింది.ఉగ్ర ముప్పును దృష్టిలో ఉంచుకుని రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని రైల్వే బోర్డును కూడా కేంద్రం ఆదేశించింది. కన్వర్ యాత్రలో ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించామని పోలీసులు చెప్పారు. 


కన్వర్ యాత్ర 2022 సందర్భంగా కన్వారియాల కోసం ఢిల్లీ ప్రభుత్వం 175 శిబిరాలను ఏర్పాటు చేసింది.హిందూ మాసం శ్రావణం మొదటి రోజు గురువారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కన్వర్ యాత్ర ప్రారంభమైంది. గంగా జలాలను తీసుకురావడానికి శివుని భక్తులు పెద్ద సంఖ్యలో హరిద్వార్‌కు చేరుకున్నారు.కొవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కన్వర్ యాత్ర జరుగుతోంది. దాదాపు పక్షం రోజుల పాటు జరిగే ఈ జాతరలో పవిత్ర నదీ జలాలను సేకరించేందుకు హరిద్వార్, పొరుగున ఉన్న రిషికేశ్‌లకు కనీసం నాలుగు కోట్ల కన్వారియాలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాల నుంచి కన్వారియాలు హరిద్వార్, రిషికేష్‌లను సందర్శించి గంగా జలాలను సేకరించి, ఇంటిలోని దేవాలయాల్లో శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు.


నోయిడాలోని కన్వర్ యాత్ర మార్గాల్లో మద్యం, మాంసం దుకాణాలను జులై 14 వతేదీ నుంచి మూసివేశారు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు తీర్థయాత్ర పట్టణాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, సోషల్ మీడియా పర్యవేక్షణ ద్వారా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. బాంబ్ డిస్పోజల్, యాంటీ టెర్రర్ స్క్వాడ్‌లను కూడా మేళా క్షేత్రంలో మోహరించారు.హరిద్వార్,పరిసర ప్రాంతాలను 12 సూపర్ జోన్‌లు, 31 జోన్‌లు, 133 సెక్టార్‌లుగా విభజించి దాదాపు 10,000 మంది పోలీసులను మోహరించారు.కన్వర్ యాత్ర మార్గాలపై డ్రోన్ నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఈటెలు, ఇతర ఆయుధాలతో శివభక్తులు ఎవరూ పట్టణంలోకి ప్రవేశించడానికి అనుమతించమని పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-07-15T15:09:13+05:30 IST