AP News: కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా

ABN , First Publish Date - 2022-09-21T14:06:48+05:30 IST

కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

AP News: కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా

అమరావతి: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు, డ్రైవర్లకు మధ్య  వివాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీల సీరియల్ నెంబర్లతో సంబంధం లేకుండా, నేరుగా స్టాక్ పాయింట్‌లోకి మాజీ మంత్రి, అధికార పార్టీ నేతల వాహనాలను అనుమతించడంతో గొడవ మొదలైంది. రెండు రోజులుగా ఇసుక కోసం స్టాక్ పాయింట్ వద్ద మూడు వందలకు పైగా టిప్పర్ లారీలు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడొచ్చిన వాహనాలకు అనుమతి ఎలా ఇస్తారని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను లారీ డ్రైవర్లు ప్రశ్నించారు. ‘‘మా ఇష్టం మీకు చేతనైంది చేసుకోండి’’ అని అనడంతో స్టాక్ పాయింట్ గేటుకు డ్రైవర్లు తమ వాహనాలను అడ్డంగా ఉంచారు. అయితే ఇసుక ఇవ్వకుండా స్టాక్ పాయింట్ మూసేస్తామని డ్రైవర్లను కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు.


ఈ క్రమంలో డ్రైవర్లకు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదేం పద్ధతి అని అడిగితే తమ లారీలను మిషన్‌తో బద్దలు కొట్టేస్తాం అని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు బెదిరిస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. 11వ సీరియల్ నెంబర్ టోకెన్ ఉన్న తనకు కాకుండా తన కళ్ళముందే ఓ మాజీ మంత్రికి చెందిన వాహనాలకు ఇసుక అందిస్తున్నారని డ్రైవర్ ఆవేదన చెందారు. అందరికీ సవ్యంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు  డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా 35 టన్నులకుపైగా లోడింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2022-09-21T14:06:48+05:30 IST