మిడ్నైట్ మీటింగ్..!
ABN , First Publish Date - 2022-01-21T16:55:46+05:30 IST
రాష్ట్రానికి మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో పట్టు సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం భారీగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా సాగుతున్న తరుణంలో
- పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి అర్ధరాత్రి సమావేశం...
- సర్వత్రా కుతూహలం
బెంగళూరు: రాష్ట్రానికి మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో పట్టు సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం భారీగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా సాగుతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మై అర్ధరాత్రి ఏకంగా మూడున్నర గంటలకు పైగా సమావేశం జరుపడం సర్వత్రా కుతూహలమనిపిస్తోంది. సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్సింగ్లు కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి పరిస్థితిలోను ఢిల్లీ వెళ్ళేది లేదని సీఎం తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్తీకరణ వంటి అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు అగ్రనేతల భేటీ మరిన్ని చర్చలకు కారణమవుతున్నాయి. బోర్డులు కార్పొరేషన్లకు త్వరలోనే అధ్యక్షుల మార్పు జరుగనుందని ఈవిషయం కూడా రహస్యభేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల అంశం కూడా ప్రధానమైన అంశంగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా అయితే ఈనెల 8 వ తేదీ నుంచి రెండురోజుల పాటు పార్టీ జాతీయ నేతలు అమిత్షా, జేపీనడ్డాలు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉండేది. రెండురోజుల పాటు నందిహిల్స్లో బసచేసి రాష్ట్ర కేబినెట్లో భారీ మార్పులతో పాటు ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారిగా సమీక్ష జరుగుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లు సమావేశం జరిగి ఉంటే సంక్రాంతి ముగిసిన ఒకటి రెండు రోజులలోనే కేబినెట్ ప్రక్షాళణ జరిగి ఉండేది. ఈలోగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో పార్టీ ముఖ్యనేతల ఢిల్లీకే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్రంలో జరగాల్సిన మార్పులకు అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలోనే ముగ్గురు కీలకులు భేటీ కావడం మరింత ఆసక్తికరమైంది. అర్ధరాత్రి సమావేశమై సీఎం బొమ్మై గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్ళేది లేదన్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు.