Mathura: ఇంత దారుణమా.. శుభలేఖ తెచ్చాడు కదా అని తీసుకోవడానికి ఆ అమ్మాయి వస్తే..

ABN , First Publish Date - 2022-06-20T20:58:59+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అది తెలిసిన వారందరినీ షాక్‌కు గురి చేసింది. ఇలాంటి కారణంతో కూడా..

Mathura: ఇంత దారుణమా.. శుభలేఖ తెచ్చాడు కదా అని తీసుకోవడానికి ఆ అమ్మాయి వస్తే..

మథుర: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అది తెలిసిన వారందరినీ షాక్‌కు గురి చేసింది. ఇలాంటి కారణంతో కూడా హత్యలు జరుగుతాయా అనేంతలా విస్మయం కలిగించింది. ఫేస్‌బుక్‌లో (Facebook) తన ఫ్రెండ్ రిక్వెస్ట్ (FB Friend Request) యాక్సెప్ట్ చేయలేదని ఓ యువకుడు యువతిపై ఉన్మాదానికి ఒడిగట్టాడు. సైకోలా మారి ఆమెపై కత్తితో దాడి చేయడంతో సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మథుర (Mathura) హైవే పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా బోహ్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అజయ్ కౌషల్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్లా బోహ్రా అనే గ్రామంలో తేజ్‌వీర్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య, 16 ఏళ్ల వయసున్న కూతురు గ్రామంలోనే నివసిస్తున్నారు.



గత ఆదివారం సాయంత్రం తేజ్‌వీర్ సింగ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య, కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ముజఫర్‌నగర్‌లోని థానా మండీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న కుక్డా అనే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఆ ఇంటికి వెళ్లాడు. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే వంకతో ఆ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో నుంచి ఆ పదహారేళ్ల అమ్మాయి బయటకు రాగానే ఆమెకు శుభలేఖ ఇస్తున్నట్టు నటిస్తూ ఆ వెడ్డింగ్ కార్డులో కనిపించకుండా దాచిన కత్తి తీసి ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. బాధతో ఆమె అరుపులు, కేకలు వేయడంతో ఆ బాలిక తల్లి సునీత కూడా కూతురి దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తల్లిపై కూడా రవి కత్తితో దాడికి యత్నించాడు.



ఈ ఘటనలో బాలిక తల్లి సునీతకు కూడా భుజంపై, నడుము భాగంలో గాయమైంది. వాళ్లిద్దరిపై దాడికి దిగిన తర్వాత రవి కూడా ఆత్మహత్యా యత్నం చేశాడు. కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. ఈ ఘటనలో సదరు బాలిక తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో స్పాట్‌లోనే చనిపోయిందని డీసీపీ ధర్మేంద్ర చౌహాన్ తెలిపారు. బాలిక తల్లి సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో నిందితుడు రవికి కూడా చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మొత్తానికి కారణం ఆ బాలిక రవి ఎఫ్‌బీలో పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకపోవడమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ బాలికను కొన్నాళ్లుగా రవి ఇష్టపడుతున్నాడని, ఇద్దరికీ పరిచయం ఉందని తెలిసింది. అయితే.. ఆమెపై పిచ్చి ప్రేమ పెంచుకున్న రవి తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోవడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Updated Date - 2022-06-20T20:58:59+05:30 IST