Virat Kohli: కోహ్లీని మళ్లీ అలా చూడబోతున్నాం: పార్థివ్ పటేల్
ABN , First Publish Date - 2022-08-05T22:49:23+05:30 IST
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు రోజులు సమీపిస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీపై కన్నేసిన భారత జట్టు పూర్తిస్థాయిలో
ముంబై: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు రోజులు సమీపిస్తున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీపై కన్నేసిన భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ ట్రోఫీకి ముందు రోహిత్ సేన ఆసియాకప్లో ఆడనుంది. ఇందులో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆగస్టు 28న దుబాయ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్న మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఆసియాకప్లో ఓ చాన్స్ ఇచ్చి చూద్దామని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయమై తాజాగా టీమిండియా మాజీ కీపర్ పార్థివ్ పటేల్(Parthiv Patel) మాట్లాడుతూ.. ఆసియా కప్లో రోహిత్శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లీ బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కోహ్లీ సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని, ఉన్నదంతా ఫామ్ సమస్యేనని అన్నాడు. అలాగే, అతడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడన్నది కూడా చూడాలని అన్నాడు. కాబట్టే ఆసియా కప్ ఎంతో కీలకంగా మారబోతోందన్నాడు. ఇది కోహ్లీకి ఒక్కడికి మాత్రమే కాదని, భారత జట్టు దృష్టికోణం కూడా అదేనని అన్నాడు. కాంబినేషన్ అనేది జట్టులో ఎంతో కీలకమని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.
కేఎల్ రాహుల్ ఫిట్గా లేకపోవడంతో ఆసియా కప్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడని పార్థివ్ పటేల్ అన్నాడు. ఆసియా కప్కు అతడు అందుబాటులో ఉంటాడని చెబుతున్నారని పేర్కొన్న పార్థివ్.. భారత్ ఇప్పటికే ఎంతో మంది ఓపెనర్లను ట్రై చేసిందన్నాడు. ఆర్సీబీ జట్టులో కోహ్లీ ఓపెనర్గా ఎంతో సౌకర్యంగా ఉన్నాడని గుర్తు చేశాడు. కోహ్లీ ఓపెనర్గా వచ్చిన అన్ని బిగ్ సీజన్స్లోనూ భారత్ విజయం సాధించిందని పార్థివ్ పటేల్ గుర్తు చేశాడు.