రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. చక్కటి నిద్ర మీ సొంతం!
ABN , First Publish Date - 2022-03-18T19:18:35+05:30 IST
రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగడం వల్ల ఉపయోగం ఏమిటి? అన్నివయసుల వారూ ఈ పద్ధతిని ఫాలో కావొచ్చా?
ఆంధ్రజ్యోతి(18-03-2022)
ప్రశ్న: రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగడం వల్ల ఉపయోగం ఏమిటి? అన్నివయసుల వారూ ఈ పద్ధతిని ఫాలో కావొచ్చా?
- గణేష్, విజయనగరం
డాక్టర్ సమాధానం: నిద్రపోయే సమయానికి కనీసం రెండు మూడు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించడమనేది ఆరోగ్యకరమైన అలవాటు. కొన్ని సార్లు ఇలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల నిద్రవేళకు ఆకలి అనిపించవచ్చు. అటువంటప్పుడు కొద్దిగా పండ్లు లేదా పాలు తీసుకుని నిద్రపోవడం కొంత మందికి అలవాటు. పాలు, పెరుగు, మజ్జిగ, జామ, అరటి, పుచ్చ, బొప్పాయి, అనాస (పైనాపిల్), కివి మొదలైన పండ్లలో ట్రిప్టోఫాన్ అనే ఓ రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్, నయసీనమైడ్ మొదలైన వివిధ రకాల రసాయనాలుగా రూపాంతరం చెందుతుంది. ఇందులో సెరోటోనిన్ ఆందోళన నియంత్రించేందుకు, మెలటోనిన్ చక్కటి నిద్రకు ఉపయోగపడతాయి. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు ఓ కప్పు పాలు తాగడం లేదా కప్పు పండ్లు తినడం వల్ల నిద్ర సరిగా పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే పెందలాడే భోజనం చేసినప్పుడు రాత్రి నిద్రలో ఆకలి వేసి మెలకువ రాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం పాలు, పండ్లేకాక, బాదం, ఆక్రోట్, పిస్తా లాంటి గింజలు కూడా ఐదారుకు మించకుండా నిద్రపోయే ముందు తీసుకోవడం మంచిదే. ఏడాదిదాటిన పిల్లల నుండి అన్ని వయసుల వారు ఇలా రాత్రి నిద్రకు ముందు పాలు తాగడం మంచిదే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)