మినీ మహానాడును విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T05:01:20+05:30 IST

మదనపల్లెలో జూలై 6వ తేదీ జరగనున్న టీడీపీ మినీ మహానాడు విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మినీ మహానాడును విజయవంతం చేయాలి
కలికిరి మండల కార్యకర్తలకు సూచనలిస్తున్న కిశోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి, జూన్‌ 27: మదనపల్లెలో జూలై 6వ తేదీ జరగనున్న టీడీపీ మినీ మహానాడు విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కలికిరి మండలం నుంచి కనీసం పది వేల మందికి తగ్గకుండా సమీకరించాలని కోరారు. మదనపల్లె దగ్గరలోనే ఉన్నందువల్ల గరిష్ట సంఖ్యలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు. సభ జరిగే రోజున కేవీ పల్లె, కలికిరి, పీలేరు మండలాలకు చెందిన వారంతా టేకలకోన ఇండస్ట్రియల్‌ పార్కు వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోవాలని అక్కడి నుంచే మదనపల్లె వరకూ ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకోవాలని తెలిపారు. తాను కూడా పార్టీ శ్రేణులతో కలిసి మోటారు సైకిలు మీదే ప్రయాణిస్తానని తెలిపారు. కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలకు చెందిన వారు మదనపల్లెకు చేరుకుంటారని వివరించారు. గ్రామాల వారీగా వాహనాలు, జన సమీకరణకు పార్టీ నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా 7వ తేదీ రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలు కలికిరిలో జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటలకు పీలేరు నియోజకవర్గం సమీక్ష ప్రారంభమవుతుందని ఆ తరువాత ఇతర నియోజకవర్గాల నుం చి వచ్చే పార్టీ నాయకులకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, రాజంపేట టీడీపీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, మండలంలోని పార్టీ అనుబంధ విభాగాల కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:01:20+05:30 IST