నిధుల మంజూరుకు మంత్రి కేటీఆర్‌ హామీ: వైరా ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-22T04:51:37+05:30 IST

వైరా మునిసిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

నిధుల మంజూరుకు మంత్రి కేటీఆర్‌ హామీ: వైరా ఎమ్మెల్యే
ఎంపీ నామాతో కలిసి కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందిస్తున్న ఎమ్మెల్యే రాములునాయక్‌

వైరా, జనవరి 21: వైరా మునిసిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. గురువారం ప్రగతిభవన్‌లో ఉమ్మడి ఖమ్మంజిల్లా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి వైరా ఎమ్మెల్యే  రాములునాయక్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వైరా మునిసిపాలిటీ సమస్యలను ఎమ్మెల్యే కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వైరా మునిసిపాలిటీ పరిధిలో జాతీయ ప్రధాన రహదారిపై పల్లిపాడు నుంచి వైరా వరకు అలాగే వైరా నుంచి సోమవరం, గండగలపాడు, లాలాపురం వరకు సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన కేటీఆర్‌ వైరా మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తానని అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T04:51:37+05:30 IST