ముందస్తు చర్యలతో ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి
ABN , First Publish Date - 2021-07-24T05:54:54+05:30 IST
ముందస్తు చర్యలతో ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి
నర్సంపేట టౌన్, జూలై 23 : ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట చెరువును, మత్తడిని మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని కలెక్టర్లు, అధికారులతో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, నష్టం కాకుండా చూడటం జరిగిందన్నారు. వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలతో చెరువులు నిండాయన్నారు. భారీ వర్షాలు పడుతున్నందున చేపలు పట్టడానికి జాలరులు, ప్రజలు చెరువవులోకి, వాగులోకి వెళ్లవద్దని కోరారు. ఈ సందర్భంగా మాధన్నపేట చెరువు అభివ్ధృధపై జిల్లా కలెక్టర్ హరిత, రెవెన్యూ అధికారులతో చర్చించారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని రవీందర్, ఏసీపీ ఫణీందర్ తహసీల్దార్ రామ్మూర్తి, నర్సంపేట మునిసిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్రెడ్డి, మండల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
కటాక్షపురం పెద్ద చెరువు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాం
ఫ ఆత్మకూరు: జాతీయ రహదారి 163పై ఉన్న కటాక్షపురం పెద్ద చెరువు మత్తడి మీద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆత్మకూరు కటాక్షపురంలోని పెద్దచెరువు మత్తడిని మంత్రి దయాకర్రావు వివరాలను సర్పంచ్ ఎస్.కె రబీయాబీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలను, పెద్దచెరువు మత్తడి పడితే వరంగల్ నుంచి భూపాలపట్నంకు రాకపోకలు బంద్ అవుతాయని వెంటనే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే వాహదారులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మత్తడి ఎక్కువ అయితే రేగొండ, పరకాల మీదుగా వరంగల్కు తిరిగిపోవాల్సి వస్తుందని మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు పంపించామని, నిధులు రాగానే టెండర్లు పిలుస్తామన్నారు. వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయిస్తాం.. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, సర్పంచ్లు ఎస్.కె. రబీయాబీ, మచ్చిక యాదగిరిగౌడ్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, సంద్యరాణి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎస్.కె .హుసెన్, తదితరులు పాల్గొన్నారు.