జగన్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-10-22T18:35:16+05:30 IST

రాష్ట్రంలో చంద్రబాబు అశాంతి, అలజడిని సృష్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మంత్రి అవంతి

విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు అశాంతి, అలజడిని సృష్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనయుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని అన్నారు. గంజాయి వ్యవహారం ఇప్పటిది కాదని...1970లో గంజాయి మొదటి కేసు నమోదు అయిందని తెలిపారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు గంటా, అయ్యన్న ఒక్కసారి అయిన ఏజెన్సీ వెళ్ళారా అని ప్రశ్నించారు. గంజాయి డాన్ అయ్యన్నను ప్రక్కన పెట్టుకొని చంద్రబాబు గంజాయి కోసం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై  చంద్రబాబు  చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీలో గెలిచి లోకేష్ బాధ తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యేలు తమతో ఉన్నారన్నారు. జగన్‌కు వస్తున్న మంచి పేరు చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సొంత మామను చంపి పార్టీని చేతులలోకి తీసుకున్నారన్నారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-22T18:35:16+05:30 IST