ప్రజలని గందరగోళానికి గురిచేసేలా మీడియా వ్యవహరించవద్దు: మంత్రి Botsa
ABN , First Publish Date - 2022-03-21T18:20:04+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చినట్టు తెలిసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చినట్టు తెలిసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ రాష్ట్రమంతా అలా జరిగినట్లు పత్రికలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని... ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దని... అధికారికంగా కనెక్షన్ ప్రజలని కోరుతున్నానని మంత్రి తెలిపారు. కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయనుకుంటే స్ధానిక సంస్థల దృష్డికి తీసుకెళ్లవచ్చని సూచించారు. ప్రజలని గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా వ్యవహరించవద్దని హితవుపలికారు. పన్నుల కట్టకపోతే జప్తులు అన్నది ఎప్పటినుంచో ఉందని... ఈ రోజు కొత్తగా వచ్చింది కాదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశంకాదని తెలిపారు. స్థానిక సంస్థలు సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రంమగా చెల్లించాలిగా అని అన్నారు. బలవంతపు పన్ను వసూలు చేయాలని... ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.