గీతం వర్సిటీ కూల్చివేతలో కక్షసాధింపు లేదు: బొత్స

ABN , First Publish Date - 2020-10-25T20:32:57+05:30 IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు

గీతం వర్సిటీ కూల్చివేతలో కక్షసాధింపు లేదు: బొత్స

విశాఖపట్నం : టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి ఎటువంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి కూల్చడం అనేది జగన్ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ఈ కూల్చివేతలపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గీతం వర్సిటీ కూల్చివేతలో ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేయాలని చూశారన్నారు. ప్రభుత్వ స్థలాలు దోచుకునే వారికి వత్తాసు పలకడం సరికాదన్నారు.


కచ్చితంగా పూర్తి చేస్తాం..

రాష్ట్రంలో ఎవరైనా భూఆక్రమణలు చేసుంటే చూపించండి.. విచారణ చేపట్టి ఏ పార్టీ వాళ్ళమీద అయినా సరే కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు దరఖాస్తు పెట్టుకుంటే ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వంపై విమర్శలు, ఎదురుదాడి చేయడం తగదని బొత్స మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలవరం గురించి మాట్లాడిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ధీమాగా చెప్పారు. అంచనాలు పెరిగినా కేంద్రాన్ని ఎన్నిసార్లైనా సరే కలిసి, లేదా ఒత్తిడి తెచ్చి మరీ పోలవరంను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-25T20:32:57+05:30 IST