రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. కొత్త చర్చకు తెరలేపిన వైనం

ABN , First Publish Date - 2022-03-07T19:06:17+05:30 IST

రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. కొత్త చర్చకు తెరలేపిన వైనం

రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. కొత్త చర్చకు తెరలేపిన వైనం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున వాడీవేడీగా సాగుతున్నాయి. ఓ వైపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా.. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో మీడియా పాయింట్‌లో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ, ఢిల్లీలో కూడా చర్చకు దారితీశాయి. ‘2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే’ అని బొత్స వ్యాఖ్యానించారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మరోవైపు మూడు రాజధానులు కట్టాలా..? వద్దా..? అని జగన్ సర్కార్ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.


ఎవరి పనులు వాళ్లు చేయాలి..!

మూడు రాజధానులపై మాట్లాడండి.. అసలు రాజధానులు కడుతున్నారా..? అని మీడియా మిత్రులు.. మంత్రిని ప్రశ్నించగా..ఇప్పుడే కదా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31లోపు అన్ని విషయాలు తెలుస్తాయి. రాజధానులు కట్టకూడదని హైకోర్టు ఎక్కడ చెప్పింది..? చట్టాలు చేయడానికి శాసనసభ, పార్లమెంట్‌లు ఉన్నాయి. ఇక్కడ చట్టాలు చేస్తే రాజ్యాంగ స్పూర్తికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అనేది నేను ఇదివరకే చెప్పాను. అలా కాదు.. శాసనసభ, పార్లమెంట్‌‌లు చట్టాలు చేయకూడదని కోర్టు చెప్పడమేంటి..? ఇవి చేయకూడదని న్యాయస్థానాలు చెబితే అసలు వ్యవస్థ ఎక్కడుంటుంది..?. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కదా తప్పుబట్టొచ్చు.. ఎవరి పనులు వాళ్లు చేయాలి.. చేసుకోవాలి. కోర్టులపై మాకు నమ్మకం ఉంది.. చట్టాలు చేయడానికే శాసనసభ ఉన్నది.. ఆ అధికారం చేసే అధికారం శాసనసభకు అధికారం ఉందిఅని మంత్రి చెప్పుకొచ్చారు.


టీడీపీపై విమర్శలు..

టీడీపీకి విధి విధానాలు అనేవి లేవు. క్షణికావేశంలో టీడీపీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఉద్ధరించాలని, ప్రజల నుంచి సానుభూతి పొందాలని, రాజకీయ సానుభూతితో అసెంబ్లీకి వచ్చారు. స్వార్థం కోసం తప్ప ప్రజా ప్రయోజనాలు, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు ఆ పార్టీకి లేవు. క్షణికావేశంలో తీసుకునే ఏ ఆలోచనలనూ ప్రజలు ఆమోదించరు. విశాలమైన ఆలోచనలు, దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తారుఅని టీడీపీపై బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి బొత్స చేసిన రాజధాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, అమరావతి రైతుల సంఘాల నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2022-03-07T19:06:17+05:30 IST