కరోనా టెస్టులపై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-04-23T20:36:56+05:30 IST
తెలంగాణలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదని, పడకలు, టీకాలు, మందులూ
హైదరాబాద్: ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ అనే వస్తోందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్టుల ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ ఆగవద్దని, అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయని, నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని, 80 టన్నుల ఆక్సిజన్ను తెప్పిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదని, పడకలు, టీకాలు, మందులూ అన్నీ అందుబాటులోనే ఉన్నాయని ప్రకటించారు. కరోనాను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై మాత్రం చర్యలు తప్పవని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలకు అనుమతి
ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు.