తెలంగాణలో ప్రతి గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామమే: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-04-25T00:46:20+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ఎంతో పురోగతి సాధించాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ఎంతో పురోగతి సాధించాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామం ఇప్పుడు ఆదర్శగ్రామమేనని ఆయన కొనియాడారు. ఇటీవల 19 జాతీయ అవార్డులు వచ్చిన జెడ్పీలు, ఎంపిపిలు, సర్పంచ్ల కు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వారిని మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పల్లె ప్రగతి సాధించిన ప్రగతికి ఈ అవార్డులే నిదర్శనమని అన్నారు. సీఎం కేసిఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.రానున్న కాలంలో అన్ని గ్రామాలకు అవార్డులు రావాలన్నారు. అవార్డులు వచ్చిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు, జెడ్పీలు ఆ స్థాయిని నిలుపుకోవాలని,ఈ విడదత నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయని మంత్రి తెలిపారు. సదాశయంతో “పల్లెప్రగతి” చేపట్టడం ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి అవార్డులు రావడం జరుగుతోందన్నారు. 2001 నుంచి 2014 ఏడాదిల మధ్య అంటే తెలంగాణ రాక ముందు కేవలం ఒకే ఒక అవార్డు దక్కింది. అది ఈ పంచాయతీ అవార్డు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత వస్తున్న అవార్డులకు లెక్కలేదు. ఈ ఒక్క ఏడాదే 19 అవార్డులు వచ్చాయంటే తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామమే!! ఇది పల్లె ప్రగతి సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉండటం, ఇన్ని అవార్డులు రావడం నా అదృష్టం.మనం సీఎం కేసిఆర్ అధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి, మన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుందని చెప్పారు.