రాష్ట్రమంతా పండుగలా పల్లె ప్రగతి: Errabelli
ABN , First Publish Date - 2022-06-04T00:39:29+05:30 IST
రాష్ట్రమంతా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao)అన్నారు.
వరంగల్: రాష్ట్రమంతా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao)అన్నారు. శుక్రవారం ఆయన పల్లె ప్రగతి (palle pragati) కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామం లో ప్రారంభించారు. అనంతరం రాయపర్తి లో, జనగామ జిల్లా కడవెండి లో పల్లె ప్రగతి లో పాల్గొన్నారు. అలాగే రాయపర్తి, కడవెండి గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, పల్లె ప్రగతి సాధించిన విజయాలతో పాటు, సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొనాలని, కలెక్టర్ల అధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లా స్థాయి అధికారిని మండల పర్యవేక్షణ అధికారిగా నియమించాలని, ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నియమించాలని, మండల స్థాయి మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ చేయాలని మంత్రి తెలిపారు.
సీఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం లేదు. అందువల్లే మన పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కేంద్రం 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే, అందులో 19 మనవే. అని చెప్పారు. ఒకప్పుడు గంగాదేవి పల్లె మాత్రమే దేశంలో ఆదర్శ గ్రామంగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గంగదేవి గ్రామాన్ని మించి నేడు ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయనిచెప్పారు. ఏడు ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ని ప్రజలు గమనించాలి. విశ్లేషించుకోవాలి. పల్లె ప్రగతి వల్ల గ్రామాలు గత వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఆధునికత తో పాటు, అన్ని సదుపాయాలు కలిగి, సమగ్రంగా సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్...ఇప్పడు కేసిఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం జోడెద్దుల్లా రాష్ట్ర ప్రగతి బండి సజావుగా ప్రయాణం సాగిస్తున్నది. ఇది చరిత్రలో చెరగని ముద్ర అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.పెన్షన్ పెంపు తో నేడు ఎంతో మందికి ఆర్ధిక చేయూత అందింది. కరోనా సమయంలో ఆర్ధిక పరిస్థితి బాగానే లేకున్నా సంక్షేమాన్ని ఆపలేదు. అభివృద్ధిని వీడలేదు అన్నారు.65 ఏండ్ల నుండి 57 ఏళ్లకు వయోపరిమితిని కుదించిన పెన్షన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు.