సీఎంగా కేసీఆర్ వచ్చాకే తెలంగాణ అభివృద్ధి మొదలైంది: మంత్రి Errabelli
ABN , First Publish Date - 2022-06-06T22:50:38+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ వచ్చిన తర్వాతే అభివృద్ధి మొదలైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.
కీసర: తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ వచ్చిన తర్వాతే అభివృద్ధి మొదలైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. ఇప్పుడు పల్లె ప్రగతి వచ్చింది. గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అనేక సదుపాయాలు కలుగుతున్నాయని చెప్పారు. పల్లెలు పచ్చగా మారుతున్నాయంటే కారణం కేసీఆర్ అని అన్నారు. రైతులుకు సాగు నీరు అంది వ్యవసాయం పచ్చగా సాగుతున్నది. రాష్ట్రం ఈ తీరుగ బాగుపడటం ప్రతిపక్షాలకు గిట్టడం లేదు. అందుకే లేనిపోని ఆరోపణలు చేసి, అల్లరి చేసి, నానా గాయి చేస్తున్నారని మంత్రి విమర్శించారు.5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోమంత్రి మల్లారెడ్డితో కలిసి పల్లె ప్రగతి(palle pragati)లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3 వేల మందికి సొంత జాగాలో ఇండ్లు కట్టుకునే వీలు సీఎం కల్పిస్తున్నారని తెలిపారు. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేస్తాం. చెప్పినవన్నీ చేశాం. చెప్పనివి కూడా ఎన్నో చేశామని మంత్రి వివరించారు.గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ బాకీ లేం. మొత్తం డబ్బులు చెల్లించాం. కేంద్రమే ఇవ్వాల్సిన డబ్బులను నిలిపివేసింది. బకాయీలను పెండింగ్ లో పెట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని బద్నాం చేయడానికి కేంద్రం పూనుకుంది. ఇదంతా అర్థంగాకుండా కొందరు సర్పంచ్ లు ఆందోళన పడుతున్నారని అన్నారు.
మరికొందరు కావాలనే ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షాల చేతుల్లో పావులు కావొద్దు. సర్పంచులు ఆగమాగం కావొద్దని హితవు పలికారు. గ్రామాలను ఆదుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున పల్లె ప్రగతి నిర్వహిస్తున్నవాళ్ళం... సర్పంచ్ లకు విశేష అధికారాలు ఇచ్చిన వాళ్ళం వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తామా? ఆలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ ల మాటలు నమ్మకండని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, పంచాయితీ రాజ్ కమిషనర్ శరత్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.