అందరినీ కాపాడుకుంటా...ఆందోళన వద్దు :మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ABN , First Publish Date - 2022-01-26T20:58:01+05:30 IST

నా నియోజక వర్గం ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు.

అందరినీ కాపాడుకుంటా...ఆందోళన వద్దు :మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్: నా నియోజక వర్గం ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ నుండి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.


గత రెండు రోజులుగా పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గం లోని రాయపర్తి, పాలకుర్తి, తొర్రూర్,  కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర మండలాల్లో జరిపిన 885 పరీక్షల్లో 72 పాజిటివ్ వచ్చాయని చెప్పారు. పాలకుర్తి మండలంలో కాస్త ఎక్కువ విస్తృతి ఉందన్నారు. మరింత జాగ్రత్త పడితే, కరోనా వ్యాప్తి ని అరికట్టే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు.కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక భౌతిక దూరం పాటించాలని, గుమి కూడి ఉండవద్దని సూచించారు. 


కరోనా నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తిచేయాలని మంత్రి అధికారులను అదేశించారు. మొదటి డోసు తీసుకున్నవారికి రెండవ డోసు వ్యాక్సిన్ ఇప్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇప్పించాలని ఆయన ఆదేశించారు.కరోనా వచ్చిన వారు అధైర్యపడకుండా కరోనా కిట్టు లోని మందులను డాక్టర్లు, వైద్య సిబ్బంది సూచనల మేరకు వాడినట్లయితే కరోనా తగ్గుతుందని ఆయన అన్నారు. ఇమ్యూనిటీ కొరకు పోషక ఆహారం, డ్రైఫ్రూట్ తీసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-01-26T20:58:01+05:30 IST