పంజాబ్ తరహా ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2022-03-22T02:09:24+05:30 IST
పంజాబ్ తరహాలో తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: పంజాబ్ తరహాలో తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంపై టీఆర్ఎస్ పార్టీ శాంతియుత జంగు సైరన్ ఊదింది. వరసగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో సీఎం కెసిఆర్ ఆదేశానుసారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారు సోమవారం సాయంత్రం మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లా, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కోసం ఓ ప్రత్యేక నిరసన, ఉద్యమ ప్రణాళికలను రూపొందించారు. ఈ సమావేశంలో వరంగల్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లా పరిషత్ ల చైర్ పర్సన్లు సుధీర్ కుమార్, పాగాల సంపత్ రెడ్డి, కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, డోర్నకల్, పరకాల, వర్దన్నపేట, నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ చైర్మన్ కిషన్ రావు, కృష్ణారెడ్డి, నూకల నరేశ్ రెడ్డి, కేశవ్, సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసిఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే, రైతులకు పంటల పెట్టుబడిగా రైతు బంధు, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా, సాగునీరు, 24 గంటల కోతలు లేని కరెంటు, రుణ మాఫీలు, రైతు కల్లాలు, రైతు వేదికలు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుంటే, కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు.