ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకుంటుంది..
ABN , First Publish Date - 2021-02-28T04:54:31+05:30 IST
ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకుంటుంది..
పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
న్యూశాయంపేట, ఫిబ్రవరి 27 : ప్రైవేటు టీచర్ల సమస్యలకు పరిష్కారం కావాలంటే ఎన్నుకోవాల్సింది ప్రశ్నించే గొంతును కాదని, సమస్యలు పరిష్కరించే వ్యక్తిని ఎన్నుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృ ద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం హంటర్రోడ్లోని అభిరామ్ గార్డెన్స్లో వడుప్సా అధ్యక్షుడు రమే్షరావు అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ అర్బన్ జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమానులు, టీచర్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు టీచర్ల సమస్యలు ప్రభుత్వానికి తెలుసని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించే వారిని గెలిపించాలన్నారు.
ప్రజాప్రతినిధులకు సైతం జీతాలు లేవు..
సంవత్సరకాలంగా ప్రజాప్రతినిధులమైన తమకు కూడా ప్రైవేటు టీచర్ల మాదిరిగానే జీతాల్లేవని, కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో ప్రజాప్రతినిధులంతా జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. అప్పుచేసి మరీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. విద్యావంతులైన టీచర్లందరూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఫోరం తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దతు తెలిపి ఎమ్మెల్సీగా అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసినదేమీ లేదని ఎద్దేవా చేశారు. విదేశాల్లోని బ్లాక్మనీని తీసుకొస్తామని, ప్రతీ ఒక్కరి ఖాతాలో లక్షల రూపాయలు జమచేస్తామని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ పేదప్రజల బతుకు భారం చేస్తున్నారన్నారు. కాజీపైటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును కొలిక్కి తీసుకురావడం లేదని, మామునూరు ఎయిర్పోర్టును జీఎమ్ఆర్ కంపెనీకి ఇస్తామంటున్నారని, ఇలా అన్ని ప్రైవేటు పరం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, పబ్లిక్ సర్వీస్ ద్వారా, గురుకుల బోర్డు ద్వారా 18,500 టీచర్లు, పోలీ్సశాఖలో 32,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ శాఖలో 9,350 ఉద్యోగాలు, సింగరేణిలో 13,500, ఆర్టీసీలో 5,500 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్థలం ఉన్న టీచర్లకు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు, ఉచిత వ్యాక్సినేషన్, బీమా సౌకర్యాలు కల్పిస్తానన్నారు.
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జీలు సుందర్రాజ్, సారంగపాణి, వడుప్సా నాయకులు భూపాల్రావు, పరంజ్యోతి, జ్ఞానేశ్వర్, సతీ్షకుమార్, శ్యామ్, నారాయణరెడ్డి, జనార్థన్, వెంకటేశ్వర్లు, రమాణారెడ్డి, రాంబాబు, రవి, రాజేష్, చక్రపాణి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు పాల్గొన్నారు.