జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్
ABN , First Publish Date - 2022-07-01T00:07:11+05:30 IST
జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్లు, మండల స్థాయిలో ఎంపీపీలకు చెక్ పవర్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
హైదరాబాద్: జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్లు, మండల స్థాయిలో ఎంపీపీలకు చెక్ పవర్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు లిఖిత పూర్వకంగా సంబంధిత శాఖ అధికారులు విడుదల చేయనున్నారు.ఇప్పటి వరకు జిల్లా పరిషత్ లలో జిల్లా పరిషత్ సిఈఓ, అకౌంట్స్ ఆఫీసర్ లకు జాయింట్ అకౌంట్ ఉండేది. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ, సూపరింటెండెంట్ లకు జాయింట్ అకౌంట్ ఉండేది.
అయితే, గ్రామ స్థాయిలో సర్పంచ్ లకు, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఉంది. జిల్లా, మండల స్థాయిల్లో కూడా జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు చాలా కాలంగా సిఎం కేసిఆర్ కి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి విజ్ఞప్తులు చేశారు.అలాగే జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు సైతం సీఎంని కలిసిన సందర్భంగా ఇదే అంశాన్ని కోరారు. ఈ విషయమై సీఎం కేసిఆర్, మంత్రి ఎర్రబెల్లికి ఆదేశాలు ఇవ్వడంతో, మంత్రి సంబంధిత శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులతో ఈ రోజు సమావేశమై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు.
త్వరలోనే దీనికి సంబంధించి జీవో జారీ కానుంది. అయితే, 15వ ఆర్థిక సంఘం నిధులలో గ్రామ పంచాయతీలకు 85శాతం, ఎంపీపీలకు 10శాతం, జెడ్పీలకు 5శాతం నిధులు వినియోగించుకునే వీలుంది. ఈ నిధుల కేటాయింపు, విడుదలలో ఆ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్ దక్కనుంది.