పనిచేసే వాళ్లు కావాలా? ప్రశ్నించే వారు కావాలా?
ABN , First Publish Date - 2021-03-01T04:35:29+05:30 IST
పనిచేసే వాళ్లు కావాలా? ప్రశ్నించే వారు కావాలా?
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీ్షరావు
- బీజేపీ, కాంగ్రెస్లపై ధ్వజం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్/ చేవెళ్ల : పనిచేసే వాళ్లు కావాలా? ప్రశ్నించే వారు కావాలా? ఓటర్లు ఆలోచించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీ్షరావు స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. ఓటు అనే ఆయుధంతో పట్టభద్రులు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో కోతలు విధించారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వాతలు పెట్టిందన్నారు. రెండేళ్లలో రూ.200 గ్యాస్ ధర పెంచి పేద మధ్యతరగతి వారిపై ఆర్థిక భారం మోపిందని, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో మేధావులు ఆలోచించాలని తెలిపారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం... దానికి అదనంగా 34 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పరిశ్రమలకు మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదన్నారు. కాలిపోయే మోటర్లు.. ట్రాన్స్ఫార్మర్లు.. కరెంట్ సరఫరా సరిగా లేక చేవెళ్ల ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం ఉందని, నియోజకవర్గంలో 2,804 మహిళా ఓటర్లు ఉన్నారని ఆరోజు సమావేశం నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. లక్ష మంది పట్టభద్రులను తయారు చేసి సమాజానికి అందించిన సురభీ వాణి గొప్పవ్యక్తి అని మంత్రి హరీ్షరావు కొనియాడారు. ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన గొప్పవ్యక్తిని గెలుపించుకోవాలన్నారు. పీవీని కించపర్చేవిధంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హద్దుమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐటీఐఆర్ మన జిల్లాలోని రావిర్యాల, తుక్కుగూడలోనే ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇప్పించలేక పోయారని తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే అభ్యర్థి వాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏళ్ల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవునిఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి సొంతగూటికి చేరారు. మంత్రుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి మాట్లాడుతూ తన తండ్రి పీవీ నరసింహారావు విలువలతో కూడిన ధర్మమార్గంలో ప్రజల సంక్షేమంకోసం పనిచేశారని, అందుకే తాను కూడా తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, నాగేందర్గౌడ్, గట్టు రాంచందర్రావు, పి.కృష్ణారెడ్డి, స్వప్నసతీష్, పట్నం అవినా్షరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.